పొడపత్రి ఒక రకమైన ఔషధ మొక్క. దీని శాస్త్రీయనామం 'జిమ్నిమా సిల్విస్టర్'., అపోసైనేసి కుటుంబానికి చెందినది. ఇది భారతదేశంలో ప్రకృతి సిద్ధంగా అరణ్యాలలో పెరుగుతంది. దీనిని సంస్కృతంలో "మేషశృంగి" అని పిలుస్తారు. అంతే కాకుండా "పుట్టభద్ర" / "మధునాశని" అని కూడా అంటారు. జింనిమా సిల్విస్ట్రి అనేది ఒక ప్రఖ్యాతమైన మొక్క. ఈ మొక్కని గుర్మర్ అని అంటారు.గుర్మర్ అంటే హిందీ వాడుకంలో మధుమేహాన్ని చంపేది అని అర్దం.వీటి ఆకులు ధీర్ఘవృత్తాకారంలో,సన్నగా ముక్కల వలె వుంటాయి.ఆకులు మృదువుగా వుంటాయి.పువ్వులు లేత పసుపు రంగులో,గుండ్రాటి ఆకారంలో వుంటాయి.పువ్వులు ఏకనాభిలో పక్కగా ఎర్పడి వుంటాయి.ఏకనాభి యొక్క కాడ పొడుగుగా వుంటాయి. రక్షక పత్రాలు పొడుగుగా,గుండ్రంగా వుంటాయి.
పొడపత్రి అడవుల్లో సహజసిద్ధంగా లభ్యమౌతుంది. అయితే మార్కెట్లోని గిరాకీ మూలంగా దీనిని సాగుచేయవచ్చును.[1] పొడపత్రిని విత్తనాల ద్వారా సాగుచేయవచ్చును. మొదట నారుమళ్ళను చేసుకొని, ఆరోగ్యంగా వుండే పిల్ల మొక్కలను పొలాల్లో నాటుకోవాలి. విత్తనాలు సాధారణంగా 7-10 రోజుల్లో మొలకెత్తుతాయి. మొలకెత్తిన 4-5 వారాల తర్వాత నేలను సిద్ధము చేసుకొని, చాళ్ళు దున్నుకొని 1-2 మీటర్ల నిడివిలో పిల్ల మొక్కల్ని నాటుకోవాలి. ఇవి ఎగబ్రాకడానికి ఊతకర్రలను మొదట్లో ఒక పందిరిలాగ ఏర్పాటుచేస్తే పొడపత్రి పందిరంతా అల్లుకొని పొదలాగా తయారౌతుంది.
ఒక్క చెట్టు నుండి 250 గ్రాముల నుండి 5-6 కిలోల ఆకులు సేకరించవచ్చును. మొక్క పుష్పించు దశలో ఆకులను సేకరించవలెను. సేకరించిన ఆకులను నీడలో ఆరబెట్టి, ఎండిన తరువాత గోతాలలో భద్రపరచుకొనవలెను. మొక్కలు అల్లుకొనే దశలో లేదా పుష్పించే దశలో వేపపిండి నీళ్ళలో కరిగించి వడియగట్టి చల్లడం వలన చీడ పీడలు నివారించవచ్చును.