ఉత్తరేణి (సర్వ రోగ నివారిణి)
ఉత్తరేణి లేదా అపామార్గం (ఆంగ్లం: Prickly Chaff Flower; సంస్కృతం: अपामार्ग) ఒక రకమైన ఔషధ మొక్క. దీని శాస్త్రీయ నామం అఖిరాంథస్ ఆస్పరా (Achyranthes aspera). ఇది అమరాంథేసి కుటుంబానికి చెందినది. వినాయక చవితి నాడు చేసే పత్ర పూజలో దీనిని ఉపయోగిస్తారు. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమములో ఈ ఆకు ఆరొ వది. ఈ ఆకు ముదురు పచ్చ రంగులో ఉంటుంది. ఆకారం అస్తవ్యస్తంగా ఉంటుంది. పరిమాణం మధ్యస్థం. ఈ చెట్టు చిన్న మొక్కగా పెరుగుతుంది. ఈ పత్రి చెట్టు యొక్క శాస్త్రీయ నామం అఖిరాంథస్ ఆస్పరా.
పేర్లు
ఉత్తరేణికి వివిధ భారతీయ భాషలలోని పేర్లు.[1]
-
సంస్కృతం : Aghata; Khara-manjari; Apamarga (अपामार्ग)
-
హిందీ : Chirchira; Latjira
-
బెంగాలీ : Apang
-
గుజరాతీ : Safed Aghedo
-
కన్నడ : Uttaranee
-
మళయాలం : Kadaladi; Katalati
-
మరాఠీ : Aghada; Pandhara-aghada
-
పంజాబీ : Kutri
-
తమిళం : Nayuruvi; Shiru-kadaladi
-
తెలుగు : Antisha; Apamargamu; Uttaraene
- Banjara :bhareta
పురాణ కథ
ఇంద్రుడు వృత్తాసురుని చంపిన తరువాత నముచి అనే రాక్షసుని చంపడానికి అతనితో కపట స్నేహం చేస్తాడు.[2] నముచి విశ్రాంతి తీసుకొంటుండగా ఇంద్రుడు అతని తలను నరికివేస్తాడు. ఆ తెగిన తల మిత్రద్రోహి అని అరుస్తూ ఇంద్రుని తరుముకొస్తుంది. దానితో భయపడిన ఇంద్రుడు బృహస్పతిని సంప్రదించి ఒక యాగము చేసి నముచి తల బారినుండి తప్పించుకుంటాడు. ఆ యాగమే రాజసూయ యాగంలోని ఒక భాగం. ఇందులో ఉత్తరేణి ధాన్యం వాడారు. ఈ ధాన్యం వాడి యాగం చేసిన ఇంద్రుడు, నముచికి కనబడడు. అలా అపమార్గం పట్టించింది కాబట్టి ఈ మొక్కకు అపామార్గం సార్ధకనామం అయింది.వినియక చవితి పూజల్లో అధినాయుకుడికి ఇష్టమైన 21 ప్రతులలో ఒకటి.సకల రోగ నివారణిగా పేర్కొంటూ ఈ మొక్కలకు అత్యంత ప్రాధాన్యత ఆయుర్వేదంలో ఉంది. అమరాంథేసీ కుటుంబానికి చెందిన ఈ మొక్క శాస్త్రీయ నామం అఖిరాంథస్ ఆస్పరా.
ఔషధ ఉపయోగాలు
- ఉత్తరేణి ఆకుల రసం కడుపునొప్పికి, అజీర్తికి, మొలలకు, ఉడుకు గడ్డలకు, చర్మపు పొంగుకు మంచి మందుగా ఉపయోగపడుతుంది. దీని వేరులతో పళ్లు తోమితే చిగుళ్లు, పళ్లు గట్టిపడతాయి.
- భారత దేశంలో ఎక్కువగా కనిపించే ఈ ఉత్తరేణీని గుండ్రని కాండాన్ని, అభి ముఖ ప్రత విన్యాసంతో దీర్ఘ వృత్తాకారంలో, లేదా వృత్తాకార ఆకులని కలిగి ఎరుపు, తెలుపు రంగులున్న పొడువాటి కంకులని కలిగి ఉంటుంది. ఈ మొక్కని ఆయుర్వేద మందుల తయారీకి వాడుతారు.
- ఉత్తరేణి ఆకుల రసాన్ని గాయాలు తగిలినప్పుడు పూస్తే రక్త స్రావం కాకుండా చూస్తుంది.
- అలాగే దురదలు, పొక్కులు, శరీరం పై పొట్టు రాలటం జరుగుతుంటే ఈ రసం శరీరానికి పట్టిస్తే ఆ వ్యాధులు తగ్గుతాయి.
- అలాగే కందిరీగ లు, తేనెటీగలు, తేళ్లు తదితరాలు కుట్టినప్పుడు ఆయా ప్రాంతాలలో ఈ ఆకులను ముద్దగా నూరి పెడితే నొప్పి, దురద తగుతాయి.
- ఉత్తరేణి గింజల్ని పొడిచేసి, ఉప్పు, పటిక పొడి, వంట కర్పూరం కల్పిన మిశ్రమం వాడితే పంటి నొప్పులు, చిగుళ్ల నుండి రక్తం కారటం తదితర సమస్యలు తగ్గి దంతాలు మెరుస్తుంటాయి.
- ఈ మొక్క లని కాల్చిన తరువాత వచ్చే బూడిదకు కాస్త ఆముదం కల్పి గజ్జి, తామర, తదితరాలపై లేపనంగా పూస్తే తగ్గుతాయి.
- అలాగే ఈ బూడిదని తేనెలో కల్పి తీసుకుంటే ఉబ్బసం, దగ్గు తదితరాలతో పాటు గుండెకు సంబంధించిన వ్యాధులు, ఊపిరితిత్తులలోని శ్లేష్మం తగ్గుతాయి.
-
మజ్జిగలో కల్పి తీసుకుంటే రక్త విరేచనాలు తగ్గుతాయి. పురుషుల్లో వచ్చే పౌరుష గ్రంథి వాపు సమస్యకు ఉత్తరేణీ చూర్ణానికి ఆవునెయ్యి కల్పి తీసుకుంటే ఫలితం ఉంటుంది.
- ఉత్తరేణీ వేళ్లను కాల్చి చూర్ణంగా చేసి, అందులో మిరియాల పొడి కల్పి రెండు పూటలా చిన్న చిన్న మాత్రలుగా చేసి తీసుకుంటే చర్మ రుగ్మతలు సమసి పోతాయి.
- నువ్వుల నూనెలో ఉత్తరేణీ రసాన్నిపోసి బాగా మరిగించాక ఆ నూనెని ప్రతి రోజూ పొట్టపై మర్ధన చేసుకుంటే కొవ్వుకరిగి సాధారణ స్ధితికి వస్తారు.
ఇతర ఉపయోగాలు
ఈ పత్రితో ఉన్న ఇతర ఉపయోగాలు :
- 1 జీర్ణకారి. శరీరములో క్రొవ్వును కరిగిస్తుంది.
- 2 కడుపుబ్బరమును తగ్గిస్తుంది
- 3 నులి పురుగులను నశింప చేస్తుంది
ఆయుర్వేదంలో
ఈ పత్రి ఉల్లేఖన ఆయుర్వేదంలో ఉంది. ఇది మూలశంక రోగాల నివారణకు ఉపయోగపడుతుంది.
మూలాలు
-
↑ Dr. K. M. Nadkarni's Indian Materia Medica, Volume 1, Edited by A. K. Nadkarni, Popular Prakashan, Bombay, 1976, pp. 21-2.
-
↑ పవిత్రవృక్షాలు, అనువాదం: పి.ఎస్. శంకరరెడ్డి, తమ్మన్న, గోపీకృష్ణ, తిరుమల తిరుపతి దేవస్థానాలు, తిరుపతి, 2006, పేజీలు: 67-8.